పరకాల :
ఓరుగల్లు పాలిటిక్స్ లో ఎప్పటికి వార్తల్లో నిలిచే వ్యక్తి కొండా మురళీ మరోసారి తన విశ్వరూపాన్ని చూపారు. పరకాల నియోజకవర్గం కొండా ఫ్యామిలీ అడ్డా అని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో వారసురాలిగా కొండా సుస్మిత నియోజకవర్గ కార్యకర్తల బాగోగులు చూసుకుంటుందని చెప్పారు. పరకాల నియోజకవర్గం నుంచి కొండా కుటుంబం పోటీలో ఉంటుందని చెప్పారు. “చిట్టక్క(సుస్మిత) కొండా మురళీ కంటే ధైర్యవంతురాలని.. చిట్టక్క తిట్టాలంటే ఎవ్వడిని పడితే వాడిని తిడుతది..వీడు వాడని లెక్కలేదు. కార్యకర్తల కోసం ఏదైనా చేస్తది” అన్నారు. గీసుగొండ తమ కుటుంబానికి అన్నం పెట్టిన ప్రాంతం అన్నారు. కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి, ఇక్కడి జనం దయవల్లే తాను చావు నుంచి బయటపడినట్లు చెప్పారు. గీసుకొండ మండలం కొమ్మాల లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చిన సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి కొండా మురళీ ఈ వాఖ్యలు చేశారు.
