హైదరాబాద్ : తెలంగాణలో త్వరలో జరుగనున్న మున్సిపల్ ఎన్నికల్లో విజయం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తులు ముమ్మరం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే మున్సిపల్ ఎలక్షన్లలో ఘన విజయం సాధించాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఎన్నికల ఇంచార్జ్ లను నియమించారు. ఆదిలాబాద్ (ఎస్టీ) పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రభుత్వ సలహాదారు పొద్దుటూరి సుదర్శన్ రెడ్డిని ఇంచార్జ్ గా నియమించారు. మల్కాజ్గిరి కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చేవెల్లకు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కరీంనగర్ కు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఖమ్మం కు మంత్రి కొండా సురేఖ, మహబూబాబాద్ (ఎస్టీ) కు మంత్రి పొన్నం ప్రభాకర్, మహబూబ్నగర్ కు మంత్రి దామోదర రాజనర్సింహా, జహీరాబాద్ కు మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, మెదక్ కు మంత్రి వివేక్ వెంకటస్వామి, నాగర్కర్నూల్ (ఎస్సీ) కు మంత్రి వాకిటి శ్రీహరి, నల్గొండ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, భువనగిరి కి మంత్రి ధనసరి అనసూయ (సీతక్క), నిజామాబాద్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, వరంగల్ (ఎస్సీ)కి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పెద్దపల్లికి మంత్రి జూపల్లి కృష్ణారావులను ఇంచార్జులు నియమించారు. వీరు సంబంధిత నియోజకవర్గాల పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పని చేసి మున్సిపల్ ఎన్నికలల్లో విజయం సాధించేందుకు దిశా నిర్దేశం చేయనున్నారు.
