నర్మెట మండలం అమ్మపురంలో మరోసారి పశువులపై దాడి
జనగామ :
జనగామ జిల్లాలో పెద్దపులి దాడులు వరుసగా చోటుచేసుకుంటుండటంతో గ్రామాల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. నర్మెట మండలం అమ్మపురం గ్రామ శివారులో ఈ రోజు తెల్లవారుజామున పెద్దపులి మరో రెండు దుడ్డేలపై దాడి చేసి చంపినట్లు స్థానికులు తెలిపారు.
ఇటీవల రోజులుగా జిల్లాలోని పలు గ్రామాల పరిధిలో పెద్దపులి సంచరిస్తున్నట్లు సమాచారం రావడంతో ప్రజలు గుప్పెట్లో జీవిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో పొలాల వైపు వెళ్లేందుకు రైతులు భయపడుతున్నారు. వరుసగా పశువులపై దాడులు జరుగుతుండటంతో గ్రామస్తుల్లో ఆందోళన మరింత పెరిగింది.
ఘటనపై సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు పెద్దపులి కదలికలపై నిఘా పెంచినట్లు తెలిపారు. రెండు, మూడు ప్రత్యేక టీమ్ లు కదలికలను పరిశీలిస్తున్నాయి. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో బయటకు వెళ్లవద్దని సూచించారు. అయితే పెద్దపులి నర్మెట్ట మీదుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వైపు వెళ్లి ఉండవచ్చనేది సమాచారం. సిద్దిపేట జిల్లా నుంచి యాదాద్రిలోకి ప్రవేశించిన పులి తిరిగి సిద్దిపేట వైపే పోతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

