- కరీంనగర్ ఆత్మీయుడికి అంబరాన్నంటిన సంబరాలు
- తరలివచ్చిన ఉద్యోగ, సాహిత్య, సామాజిక లోకం
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 16 మంది అడిషనల్ కలెక్టర్లకు ‘ఐఏఎస్’ (IAS) హోదా కన్ఫర్మ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కరీంనగర్ జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా గతంలో కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్గా పనిచేసి, ప్రస్తుతం మహాత్మా జ్యోతిబా ఫూలే విద్యాలయాల సంస్థ సంయుక్త కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న జీవీ శ్యాంప్రసాద్లాల్కు ఐఏఎస్ దక్కడంపై కరీంనగర్ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని కరీంనగర్ ఫిలిం భవన్లో ‘ఎస్పీ ఫ్రెండ్స్’ (SP Friends) మరియు ‘కరీంనగర్ ఫిలిం సొసైటీ’ ఆధ్వర్యంలో ‘గ్రీట్ అండ్ మీట్’ (ఆత్మీయ సమ్మేళనం) కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు వందలాదిగా మిత్రులు, అభిమానులు హాజరయ్యారు.
ఈ ఆత్మీయ సమ్మేళనంలో టీజీవో, టీఎన్జీవో, పీఆర్టీయూ, టీఆర్టీఎఫ్ వంటి ప్రముఖ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో పాటు.. సాహితీ గౌతమి, జాతీయ సాహిత్య పరిషత్, తెలంగాణ రచయితల సంఘం, తెలంగాణ రచయితల వేదిక వంటి సాహిత్య సంస్థలు పాల్గొన్నాయి. అలాగే రెవెన్యూ అధికారుల సంఘం, చెలిమి బృందం, పలువురు కళాకారులు, సామాజిక స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరై శ్యాంప్రసాద్లాల్ గారికి పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
హుస్నాబాద్ జడ్పీ హైస్కూల్లో విద్యాభ్యాసం పూర్తి చేసిన శ్యాంప్రసాద్లాల్, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాలలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. కొంతకాలం ఈనాడు దినపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేసిన ఆయన, గ్రూప్-2 ద్వారా ఎంపికై ఉమ్మడి కరీంనగర్ జిల్లా గంభీరావుపేటలో డిప్యూటీ తహసీల్దార్గా తన ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు. అంచలంచెలుగా ఎదుగుతూ తహసీల్దార్, ఆర్డీఓ, డీఆర్ఓ, అడిషనల్ కలెక్టర్ వంటి వివిధ హోదాల్లో సమర్థవంతంగా విధులు నిర్వహించి నేడు ఐఏఎస్ స్థాయికి చేరుకోవడం గర్వకారణమని పలువురు వక్తలు కొనియాడారు. స్వగ్రామమైన హుస్నాబాద్లోనూ ఆయన మిత్రబృందం సంబరాలు జరుపుకుంది.


ధన్యవాదాలండీ మంచి మనిషిని పరిచయం చేశారు